ప్రపంచకప్ మిస్ అయినా బాధలేదు.. నాన్న చివరి రోజుల్లో తోడుగా ఉన్నా.. అదే చాలు: జితేశ్‌ శర్మ భావోద్వేగం

  • టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై స్పందించిన జితేశ్‌ శర్మ
  • జట్టులో చోటు కోల్పోయినప్పుడు మొదట బాధపడ్డానని వెల్లడి
  • అదే సమయంలో తండ్రి మరణించారని.. చివరి రోజుల్లో ఆయనతోనే ఉన్నానని వ్యాఖ్య
  • ప్రపంచకప్‌ కంటే నాన్నకే నా అవసరం ఎక్కువని భావించానని భావోద్వేగం
  • టీమిండియా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన జితేశ్‌
టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ జితేశ్‌ శర్మ, 2026 టీ20 ప్రపంచకప్‌కు చివరి నిమిషంలో దూరమవడంపై తొలిసారి స్పందించాడు. జట్టులో చోటు దక్కనప్పుడు బాధపడినప్పటికీ, అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి చివరి రోజుల్లో సేవ చేసే అవకాశం దక్కడం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని భావోద్వేగంగా చెప్పాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జితేశ్‌ ఈ విషయాలను పంచుకున్నాడు.

2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత జట్టులో జితేశ్‌ శర్మకు అవకాశాలు లభించాయి. అయితే, వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో రాణించిన ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసి, సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఈ పరిణామంపై జితేశ్‌ మాట్లాడుతూ... "ప్రపంచకప్ జట్టులో స్థానం లభించలేదని తెలిసినప్పుడు చాలా నిరాశకు గురయ్యాను. మనిషిని కాబట్టి బాధపడటం సహజమే. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతుతో ఆ దశను దాటగలిగాను" అని అన్నాడు.

"అదే సమయంలో నా తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఫిబ్రవరి 1న ఆయన కన్నుమూశారు. ఆ చివరి ఏడు రోజులు నేను ఆయనతోనే ఉన్నాను. ప్రపంచకప్ కంటే నాన్నకే నా అవసరం ఎక్కువగా ఉందని తర్వాత గ్రహించాను. ఆ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆయన చివరి రోజుల్లో సేవ చేసే భాగ్యం కలిగినందుకు దేవుడికి కృతజ్ఞతలు" అని జితేశ్‌ తెలిపాడు. 

ఇక‌, భారత జట్టు ప్రపంచకప్ గెలవడం పట్ల చాలా సంతోషంగా ఉందని, కెప్టెన్, కోచ్ కల నెరవేరినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ఇంట్లో కూర్చుని మ్యాచ్ చూడటం చాలా ఒత్తిడితో కూడుకున్న అనుభవమని జితేశ్ వ్యాఖ్యానించాడు.


More Telugu News