Andhra Pradesh: కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి.. తల్లి చేసిన పొరపాటుతో ఘోరం

Tragedy in Eluru Mothers Mistake Leads to Daughters Death
  • భర్తను బెదిరించేందుకు తల్లి తెచ్చిన పురుగుల మందు
  • కూల్‌డ్రింక్ అనుకుని తాగేసిన ఐదేళ్ల బాలిక
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
  • దంపతుల మధ్య గొడవలే ఈ ఘోరానికి కారణం
ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భర్తను బెదిరించేందుకు ఓ తల్లి కూల్‌డ్రింక్ బాటిల్‌లో తెచ్చిన పురుగుల మందును.. ఐదేళ్ల కుమార్తె నిజంగానే కూల్‌డ్రింక్ అనుకుని తాగేసి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం మర్రిగూడేనికి చెందిన పూనెం నాగేంద్రబాబుకు, అందర్వేదిగూడేనికి చెందిన కుమారికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఐదేళ్ల కుమార్తె రితిక ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తను భయపెట్టి దారికి తెచ్చుకోవాలని భావించిన కుమారి, పొగాకు తోటలకు కొట్టే జిడ్డు మందును ఓ కూల్‌డ్రింక్ సీసాలో నింపి ఇంటి దగ్గరున్న కంచె వద్ద పెట్టింది.

మంగళవారం ఆ బాటిల్‌ను గమనించిన చిన్నారి రితిక, అందులో ఉన్నది కూల్‌డ్రింక్ అని భ్రమపడింది. ఎవరూ చూడని సమయంలో దాన్ని తాగేసింది. కొద్దిసేపటికే తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడటంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బుట్టాయగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం రితిక మృతి చెందింది. తల్లి క్షణికావేశంలో చేసిన పనికి పసిపాప ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Andhra Pradesh
Ritika
Eluru district
insecticide poisoning
Andarvedigudem
Buttayagudem
child death
domestic dispute
accidental poisoning
pesticide
cool drink

More Telugu News