మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫోన్‌పే 'ఆల్-ఇన్-వన్' కార్డు వచ్చేసింది!

  • కొత్త ఎన్‌సీఎంసీ కార్డు ఆవిష్కరించిన ఫోన్ పే
  • నెట్ లేకున్నా ఆఫ్‌లైన్‌లో ట్యాప్-అండ్-పే సదుపాయం
  • హైదరాబాద్ మెట్రో కౌంటర్లలో కార్డులు అందుబాటులో
  • దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, టోల్‌ప్లాజాల్లో చెల్లింపులు
  • గరిష్ఠంగా రూ.2,000 వరకు బ్యాలెన్స్‌
  • అన్ని ప్రయాణాలకు ఇక ఒకటే కార్డు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే సరికొత్త 'రూపే ఆన్-ది-గో' కార్డును అందుబాటులోకి తెచ్చింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (NCMC) కింద పనిచేసే ఈ కార్డుతో రవాణా చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆఫ్‌లైన్‌లోనే దీని ద్వారా పేమెంట్స్ చేయవచ్చు.

ఎలా పొందాలి?
  • ప్రయాణికులు తొలి దశలో హైదరాబాద్‌లోని మెట్రో టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు
  • మీ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ధ్రువీకరించాలి
  • మెట్రో ఏజెంట్ ద్వారా కార్డు తీసుకుని యూపీఐ, నగదు లేదా ఇతర కార్డుల ద్వారా డబ్బులు జమ చేసుకోవచ్చు

ప్రత్యేకతలు ఇవే..
ప్రీపెయిడ్ విధానం: ఈ కార్డులోని చిప్‌లోనే డబ్బు నిల్వ ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్ అవసరం లేకుండానే 'ట్యాప్-అండ్-పే' పద్ధతిలో టికెట్ ఛార్జీలు చెల్లించవచ్చు.
లావాదేవీల పరిమితి: కార్డులో గరిష్ఠంగా రూ.2,000 వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా ఒకేసారి గరిష్ఠంగా రూ.500 వరకు లావాదేవీలు జరపవచ్చు.

ఒక్క కార్డు.. ఎన్నో ఉపయోగాలు: ఇది కేవలం హైదరాబాద్ మెట్రోకే పరిమితం కాదు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని మెట్రోలు, బస్సులు, రైళ్లు, టోల్ ప్లాజాలు, పార్కింగ్ కేంద్రాల్లో కూడా ఈ కార్డును వాడుకోవచ్చు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని రవాణా సంస్థలతో అనుసంధానం చేసి, ఈ సేవలను మరింత విస్తరిస్తామని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ వెల్లడించారు.


More Telugu News