చర్లపల్లి ప్లాంట్లలో తగ్గిన గ్యాస్ సరఫరా.. రోడ్లపై నిలిచిన ట్యాంకర్లు

  • భారీగా తగ్గిన ఇంధన కోటా.. మూడు ప్లాంట్లలోనూ అదే పరిస్థితి
  • కమర్షియల్ సిలిండర్ల పంపిణీలో కఠిన ఆంక్షలు
  • పరిమిత సంఖ్యలో మధ్యాహ్నం 12 తర్వాత టోకెన్ల జారీ
చర్లపల్లిలోని ప్రధాన గ్యాస్ నింపే కేంద్రాల్లో ఇంధన సరఫరా ఒక్కసారిగా కుంటుపడింది. భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్ పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) సంస్థల నుంచి ఇంధన సరఫరా దాదాపు 75 శాతం మేర తగ్గిపోవడంతో గ్యాస్ లారీల రాకపోకలు నిలిచిపోయాయి. ముడి చమురు లభ్యత తగ్గడమే ఈ భారీ సరఫరా కోతకు కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం. చర్లపల్లిలోని ఈ మూడు ప్రధాన ప్లాంట్ల నుంచి కేవలం తెలంగాణతో పాటూ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు కూడా భారీగా చమురు, గ్యాస్ సరఫరా అవుతుంది. తాజాగా సరఫరా తగ్గడంతో ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాహనాలు ప్లాంట్ల వద్దే బారులు తీరాయి.

పరిమిత సంఖ్యలో టోకెన్లు
ప్రస్తుతం నెలకొన్న కొరత దృష్ట్యా కంపెనీలు కమర్షియల్ సిలిండర్ల పంపిణీలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాతే కొనుగోలుదారులకు టోకెన్లు జారీ చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే సిలిండర్లను అందజేస్తుండటంతో వ్యాపారులు, ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్ జామ్ - వాహనాల బారులు
గ్యాస్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితుల్లో భారీ సంఖ్యలో ఇంధన వాహనాలు చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ప్రధాన రహదారులపై నిలిచిపోయాయి. దీనివల్ల స్థానికంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.


More Telugu News