ప్రతి గాయం ఒక సంతకమే.. ఇన్‌స్టాలో మంచు మనోజ్ స్ఫూర్తిదాయక పోస్ట్

  • డేవిడ్ రెడ్డి' సినిమా కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న మంచు మనోజ్
  • సాకులు చెప్పకుండా కఠినంగా శ్రమిస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
  • హనుమ రెడ్డి దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా చిత్రం
  •  హీరోయిన్‌గా ఉక్రెయిన్ నటి మరియా రియాబోషప్కా  
నటుడు మంచు మనోజ్ తన రాబోయే చిత్రం 'డేవిడ్ రెడ్డి' కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత మూడు వారాలుగా జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ, తన పాత్రకు అవసరమైన ఫిజిక్‌ను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన పట్టుదల గురించి వివరిస్తూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

"మూడు వారాల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యానికి తావు లేదు. సాకులు చెప్పడం లేదు. సోమవారం నుంచి మొదలుపెడదాం అనే ఆలోచన లేదు. మళ్లీ రియల్ స్టంట్స్ మోడ్‌లోకి వచ్చేశాను" అని మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రాశాడు. యాక్షన్ సినిమాల్లో నటించడం సాధ్యం కాదని, ప్రతి దెబ్బ, ప్రతి పతనం నిజంగానే ఉండాలని ఆయన పేర్కొన్నాడు. "శరీరమే మన నైపుణ్యం అయినప్పుడు, షార్ట్‌కట్‌లు ఆత్మద్రోహంతో సమానం. ప్రతి గాయం ఒక సంతకం" అని ఆయన వ్యాఖ్యానించాడు.

బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ మాటలను గుర్తుచేస్తూ "అసలైన పోరాటం లైట్ల వెలుగులో కాదు, జిమ్ లోనే! ఎవరూ చూడని జిమ్‌లోనే గెలుస్తాం లేదా ఓడిపోతాం" అని మనోజ్ పేర్కొన్నాడు. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, కానీ 21 రోజుల క్రితం ఉన్న మనిషిని ఇప్పుడు కాదని, ప్రస్తుతానికి ఇది చాలని ఆయన తెలిపాడు.

హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో 'డేవిడ్ రెడ్డి' ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రంలో ఉక్రెయిన్ నటి మరియా రియాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో ఆమె 'క్లారా విట్మోర్' అనే పాత్రలో కనిపించనుంది. పాన్-ఇండియా స్థాయిలో వస్తున్న ఈ చిత్రంలోకి ఆమెకు మనోజ్ సాదర స్వాగతం పలికాడు.


More Telugu News