ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు... మన వద్ద గ్యాస్ కొరత లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్

  • భారత్ పై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం
  • రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదన్న మంత్రి నాదెండ్ల
  • బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని అధికారులకు ఆదేశం
  • కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలని హెచ్చరిక
  • గృహ అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టీకరణ
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరాలో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన భరోసా ఇచ్చారు.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు, సరఫరాపై మంత్రి మంగళవారం ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కీలక సమయంలో గ్యాస్‌ను అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా జిల్లా జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించడం, ఇష్టానుసారం ధరలు పెంచడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని మంత్రి తెలిపారు. అవసరమైతే, వాణిజ్య అవసరాలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేస్తామన్నారు. రోజువారీ నిల్వల్లో ఏమాత్రం తేడా వచ్చినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, సరఫరా వ్యవస్థను పూర్తి అప్రమత్తంగా ఉంచాలని అధికారులకు సూచించారు.


More Telugu News