చైనా ఓకే... ఎఫ్‌డీఐలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఎఫ్‌డీఐ నిబంధనలలో సడలింపులకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం
  • చైనా సహా సరిహద్దు దేశాలకు సడలింపులు
  • 2020లో గాల్వాన్ లోయలో ఉద్రిక్తతల అనంతరం కఠిన నిర్ణయాలు తీసుకున్న కేంద్రం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై, చైనాతో సహా మన దేశంతో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలలో సడలింపులకు సిద్ధమైనట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. 

2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఈ క్రమంలో చైనాకు చెందిన టిక్ టాక్, వియ్ చాట్ వంటి 200 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ నుంచి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలను కూడా కేంద్రం తిరస్కరించింది. చైనా నుంచి వచ్చే ఎఫ్‌డీఐలపై నిబంధనలను కఠినతరం చేసింది.

సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై 2020లో ప్రెస్ నోట్ 3ని విడుదల చేసింది. దీని ప్రకారం ఏ భారత సంస్థలోనైనా సరిహద్దు దేశాల సంస్థలు పెట్టుబడులు పెడితే ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆప్ఘనిస్థాన్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.


More Telugu News