యుద్ధం ఎప్పుడు ఆపాలన్నది మా చేతుల్లోనే ఉంది: ఇరాన్ స్పష్టీకరణ
- యుద్ధం త్వరగానే ముగుస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్
- ప్రారంభించడం వరకే ట్రంప్ చేతుల్లో.. ముగింపును తామే డిసైడ్ చేస్తామని వెల్లడి
- శాంతి కోసం పుతిన్ ప్రయత్నాలు.. ట్రంప్ కు ఫోన్ కాల్
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్పై యుద్ధం ‘‘చాలా త్వరగా ముగుస్తుంది’’ అన్న ట్రంప్ మాటలకు.. ‘‘యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించేది అమెరికా కాదు.. మేమే’’ అంటూ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) దీటుగా జవాబిచ్చింది.
ఐఆర్ జీసీ ప్రకటన..
‘‘ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు, సమీకరణాలు ఇప్పుడు మా సాయుధ దళాల చేతుల్లో ఉన్నాయి. అమెరికా దళాలు యుద్ధాన్ని ముగించలేవు. ఎప్పుడు ఆపాలో మేమే నిర్ణయిస్తాం’’ అని ఐఆర్ జీసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు ఎప్పుడు ఆపాలి అనేది తమ ఇష్టమని ఇరాన్ తేల్చి చెప్పింది.
మళ్లీ కోలుకోలేరంటూ ట్రంప్ హెచ్చరిక..
అంతకుముందు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. ‘‘ఇరాన్ గనుక హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను అడ్డుకుంటే.. ఇప్పటివరకు జరిగిన దానికంటే 20 రెట్లు గట్టిగా అమెరికా దెబ్బకొడుతుంది’’ అని హెచ్చరించారు. ఇరాన్ మళ్ళీ ఒక దేశంగా కోలుకోలేనంతగా ఆ దేశంలోని కీలక లక్ష్యాలను ధ్వంసం చేస్తామని, వారిపై ‘మరణం, నిప్పు, ఆగ్రహం’ వర్షిస్తాయని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధిని క్లియర్ చేయడం చైనా సహా ఇతర దేశాలకు అమెరికా ఇచ్చే బహుమతి అని ఆయన పేర్కొన్నారు.
శాంతి కోసం పుతిన్ ప్రయత్నాలు..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. గల్ఫ్ దేశాల నేతలు మరియు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో చర్చించిన అనంతరం.. ఈ వివాదాన్ని దౌత్యపరంగా త్వరగా పరిష్కరించడానికి కొన్ని ప్రతిపాదనలను పుతిన్ ట్రంప్ ముందు ఉంచినట్లు సమాచారం.