యూరప్ ఆకాశంలో భారీ అగ్నిగోళం.. శాస్త్రవేత్తల పరిశోధన షురూ!

  • నైరుతి నుంచి ఈశాన్యం వైపు ప్రయాణించిన అగ్నిగోళం 
  • ఆరు సెకన్ల పాటు మెరిసి ముక్కలైన వస్తువు
  • జర్మనీలోని కోబ్లెంజ్ ప్రాంతంలో పడ్డ శకలాలు
  • ఒక ఇంటిపై పడిన ఫుట్‌బాల్ పరిమాణపు రాయి
  • ఆశ్చర్యంలో ముంచెత్తిన అంతరిక్ష దృశ్యం
యూరప్‌లోని పలు దేశాల ప్రజలను మార్చి 8వ తేదీ సాయంత్రం ఒక అద్భుత దృశ్యం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన అగ్నిగోళం ఒకటి వేగంగా ప్రయాణిస్తూ కనిపించింది. దాదాపు ఆరు సెకన్ల పాటు వెలుగులు చిమ్ముతూ ప్రయాణించిన ఈ అగ్నిగోళం చివరకు గాలిలోనే ముక్కలై భూమిపై పడింది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఇది స్పష్టంగా కనిపించింది.

శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనా ప్రకారం ఇది కొన్ని మీటర్ల వ్యాసం కలిగి ఉంది. జర్మనీలోని కోబ్లెంజ్ ప్రాంతంలో దీని శకలాలు పడ్డాయి. ఒక ఇంటి కప్పును చీల్చుకుంటూ సుమారు ఫుట్‌బాల్ పరిమాణంలో ఉన్న రాయి లోపలికి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. గాలిలోనే పేలిపోవడంతో భూమిపైకి వచ్చేసరికి చిన్న చిన్న ముక్కలుగా మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), ఇతర పరిశోధనా సంస్థలు ఈ అగ్నిగోళం ప్రయాణించిన మార్గాన్ని విశ్లేషిస్తున్నాయి. ఇది ఉల్క కావచ్చని పలువురు భావిస్తున్నారు. ఇవి సాధారణంగా ప్రతి కొన్ని వారాలకు ఒకసారి భూ వాతావరణంలోకి వస్తుంటాయని, అయితే ఇంత ప్రకాశవంతంగా కనిపించడం అరుదని వారు పేర్కొంటున్నారు. సూర్యాస్తమయం సమయంలో వెలుతురు ఎక్కువగా ఉన్న దిశ నుంచి ఇది రావడంతో భూమిపై ఉండే టెలిస్కోపులు దీనిని ముందుగా గుర్తించలేకపోయాయని సమాచారం.


More Telugu News