టీమిండియాపై కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షుల ప్రశంసలు

  • టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా చారిత్రక విజయం
  • ఈ విజయంతో 140 కోట్ల మంది భారతీయులు గర్వంగా ఉన్నారన్న ఖర్గే
  • ఈ విజయాన్ని దేశం వేడుకలా జరుపుకుంటోందన్న నితిన్ నబీన్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని కైవసుకున్న భారత జట్టుపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక పోరులో భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ అద్భుత విజయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ హర్షం వ్యక్తం చేస్తూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు.

టీమిండియా గెలుపును మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా కొనియాడారు. "140 కోట్ల మంది భారతీయులు ఈ రాత్రి ఎంతో గర్వంగా ఉన్నారు" పేర్కొన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించిన తీరును మెచ్చుకున్నారు. సంజూ శాంసన్‌ను 'ఫైనల్ రక్షకుడు'గా, ఇషాన్ కిషన్‌ను 'అన్‌సంగ్ హీరో'గా ఆయన అభివర్ణించారు. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్‌ సహా జట్టు సభ్యులందరి సమష్టి కృషే ఈ విజయాన్నందించిందని ఆయన ప్రశంసించారు.

కోట్లాదిమందికి స్ఫూర్తి
టీ20 ప్రపంచకప్‌లో భారత్ చారిత్రక విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశం గర్వించదగ్గ క్షణమని, ఆటగాళ్ల క్రమశిక్షణ, సమష్టి కృషే ఈ అద్భుతానికి కారణమని ఆయన కొనియాడారు.  భారత జట్టు విజయంపై 'ఎక్స్' వేదికగా స్పందించిన నితిన్ .. "టీమ్ ఇండియాకు అభినందనలు! పట్టుదల, క్రమశిక్షణతో కూడిన అద్భుత విజయం ఇది. ఆటగాళ్ల స్ఫూర్తి దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని దేశం మొత్తం వేడుకలా జరుపుకుంటోంది" అని పేర్కొన్నారు.


More Telugu News