నేపాల్ ఏకైక కుబేరుడు.. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు!

  • నేపాల్ ఏకైక బిలియనీర్ బినోద్ చౌదరికి ఎన్నికల్లో పరాభవం
  • నవల్ పరాసి వెస్ట్-1 నియోజకవర్గంలో భారీ తేడాతో ఓటమి
  • దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభంజనం
  • నేపాలీ కాంగ్రెస్ అగ్రనేతలకూ తప్పని ఓటమి
  • ఫోర్బ్స్ జాబితాలో నేపాల్ నుంచి ఏకైక కుబేరుడిగా చౌదరి
నేపాల్ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. దేశంలోని ఏకైక బిలియనీర్, ప్రముఖ పారిశ్రామికవేత్త బినోద్ చౌదరి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీ తరఫున నవల్ పరాసి వెస్ట్-1 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) అభ్యర్థి బిక్రమ్ ఖనాల్ చేతిలో ఓడిపోయారు.

నేపాల్ ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి బిక్రమ్ ఖనాల్‌కు 45,241 ఓట్లు పోలవగా, బినోద్ చౌదరికి కేవలం 9,502 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో చౌదరి భారీ ఓట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం నేపాల్‌లో ఆర్‌ఎస్‌పీ ప్రభంజనం కొనసాగుతోంది. సంప్రదాయ రాజకీయ పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్ (యూఎంఎల్) పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఓడిపోతున్నారు.

నేపాలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గగన్ థాపా, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ పౌడెల్ వంటి ఉద్ధండులు కూడా ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఆర్‌ఎస్‌పీ 103 స్థానాల్లో విజయం సాధించి, మరో 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు నేపాలీ కాంగ్రెస్ కేవలం 15 స్థానాల్లో గెలిచి, 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది.

కాగా, బినోద్ చౌదరి గత దశాబ్ద కాలంగా ఫోర్బ్స్ జాబితాలో నేపాల్ ఏకైక బిలియనీర్‌గా కొనసాగుతున్నారు. 2026 మార్చి నాటికి ఆయన ఆస్తుల విలువ 2.1 బిలియన్ డాలర్లుగా ఉంది. సీజీ కార్ప్ గ్లోబల్ సంస్థకు అధిపతిగా ఉన్న చౌదరికి.. ప్రసిద్ధ 'వై వై' (Wai Wai) నూడిల్స్, నబిల్ బ్యాంక్, తాజ్ హోటల్స్ భాగస్వామ్యంతో నడిచే పలు లగ్జరీ హోటళ్ల వ్యాపారాలు ఉన్నాయి. గతంలో 2017, 2022 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన చౌదరి.. ఈసారి మాత్రం ఆర్‌ఎస్‌పీ ప్రభంజనంలో సీటు కోల్పోయారు.


More Telugu News