ఢిల్లీలో డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ

  • రాష్ట్రంలో మారుతున్న రియల్ ఎస్టేట్ పరిస్థితులపై ఇరువురి చర్చ
  • అమరావతి, విశాఖలను గ్లోబల్ సిటీలుగా మార్చే ప్రణాళికల వివరణ
  • ఏపీలో ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టులు చేపట్టాలని డీఎల్ఎఫ్‌కు ఆహ్వానం
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో వేగంగా మారుతున్న రియల్ ఎస్టేట్ ముఖచిత్రంపై ఇరువురూ ఆసక్తికరంగా చర్చించారు. ఈ సందర్భంగా రాజీవ్ సింగ్‌ను కలవడం సంతోషంగా ఉందని సీఎం తెలిపారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా అమరావతి, విశాఖపట్నం నగరాలను ప్రపంచ స్థాయి అర్బన్ సెంటర్లుగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు వివరించారు. ఈ బృహత్తర ప్రణాళికలో భాగస్వాములు కావాలని డీఎల్ఎఫ్ సంస్థను ఆయన కోరారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు రావాలని ఆహ్వానించారు.

దేశంలోనే అత్యున్నత రియల్ ఎస్టేట్ బ్రాండ్‌గా గుర్తింపు ఉన్న డీఎల్ఎఫ్‌ను ఏపీకి స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ల్యాండ్‌మార్క్ డెవలప్‌మెంట్స్‌ను సృష్టించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, తద్వారా ఏపీ ప్రగతిలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. 


More Telugu News