మమతా బెనర్జీ, బెంగాల్ ప్రభుత్వం తీరుపై ద్రౌపది ముర్ము అసహనం

  • బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ వైఫల్యం
  • సీఎం లేదా మంత్రుల నుంచి అధికారిక స్వాగతం అందలేదన్న రాష్ట్రపతి
  • మమతా బెనర్జీపై తనకు ఎలాంటి ద్వేషం లేదన్న రాష్ట్రపతి
  • మమత తనకు సోదరి లాంటి వారన్న రాష్ట్రపతి
పశ్చిమ బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ వైఫల్యం కనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్‌లో అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వలేదని, అలాగే రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు ముఖ్యమంత్రి లేదా మంత్రుల నుంచి అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు.

ఆదివాసీ సదస్సుకు తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉందని తెలిపారు. దీనికి ప్రభుత్వం అనుమతించకపోవడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఇంత చేసినప్పటికీ తనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎలాంటి ద్వేషం లేదని, ఆమె తన సోదరితో సమానమని అన్నారు. కానీ ఆమె కోపంగా ఉండవచ్చని వ్యాఖ్యానించారు. బెంగాల్ గవర్నర్ ట్రాన్స్ ఫర్ అయినందున స్వాగతం పలకలేకపోయారని తనకు తెలుసని అన్నారు. తాను కూడా బెంగాల్ బిడ్డనే అని అన్నారు.

9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సులో ప్రసంగించడానికి రాష్ట్రపతి బెంగాల్‌లోని సిలిగురికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు స్వాగతం పలకాలి. కానీ అధికారికంగా స్వాగతం పలకడానికి ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు.

అంతర్జాతీయ సంతాల్ సదస్సును బిధాన్ నగర్‌లో నిర్వహించాల్సి ఉండగా, అధికారులు సిలిగురిలోని గోసాయిన్‌‍పూర్‌కు మార్చారని ద్రౌపది ముర్ము తెలిపారు. సంతాల్ సదస్సుకు పెద్ద ఎత్తున సంతాల్ ఆదివాసీలు తరలి వస్తుండటం తాను చూశానని, కానీ వారిని కొంతమంది అడ్డుకున్నారని ఆరోపించారు. సంతాల్ జాతీయులు ఏకంకావడం, చదువుకోవడం, బలోపేతం కావడం వారికి ఇష్టం లేనట్లుగా ఉందని అన్నారు.


More Telugu News