జగన్ మద్య నిషేధం హామీ వెనుక కథ వేరే ఉంది: లోకేశ్

  • ప్రజలను వంచించడానికే ఆ హామీ అన్న లోకేశ్
  • ప్రతి నెల రూ. 100 కోట్ల ముడుపులు అందాయని ట్వీట్
  • రూ. 3,500 కోట్ల లాండరింగ్ జరిగిందన్న లోకేశ్

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన 'మద్య నిషేధం' హామీ వెనుక అసలు కథ వేరే ఉందని, ఆ హామీ కేవలం ప్రజలను వంచించడానికేనని లోకేశ్ ఆరోపించారు. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని, గత ఐదేళ్లలో జరిగిన అవినీతి చిట్టాను ఆయన బయటపెట్టారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వచ్చిన కథనాల క్లిప్పింగ్ లను కూడా లోకేశ్ తన ట్వీట్ లో పంచుకున్నారు.


మద్యం వ్యాపారం ద్వారా ప్రతి నెలా సుమారు వంద కోట్ల రూపాయల మేర ముడుపులు అందాయని, మొత్తంగా 3,500 కోట్ల రూపాయల మేర మనీ లాండరింగ్ జరిగిందని లోకేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఇప్పటికే 1,048 కోట్ల రూపాయల నగదు లావాదేవీల జాడను వెలికితీసిందని గుర్తుచేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి హోదాలో జగన్ మద్య నిషేధం గురించి ప్రసంగాలు చేస్తుంటే, మరోవైపు ఆయన అనుచరులు అక్రమ మద్యం ద్వారా వేల కోట్లు గడించారని మండిపడ్డారు. ఈ క్రమంలో వేలాది పేద కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు ఈ దోపిడీపై సమాధానం చెబుతారా? లేక మౌనంగా ఉండిపోతారా? అంటూ జగన్‌కు లోకేశ్ సూటి ప్రశ్న సంధించారు.



More Telugu News