రాజమండ్రి పర్యటనలో ఉన్న జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానాకు అస్వస్థత
- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన కిశోర్ మక్వానా
- సమీక్షా సమావేశంలో అస్వస్థతకు గురైన వైనం
- వెంటనే ఆసుపత్రికి తరలించిన అధికారులు
రాజమండ్రి పర్యటనలో ఉన్న జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం స్థానికంగా ఆందోళన కలిగించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు.
రాజమండ్రిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎస్సీల సంక్షేమంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా ఆయనకు ఒక్కసారిగా వాంతులు అయ్యాయి. దీంతో అధికారులు సమావేశాన్ని నిలిపివేసి తక్షణమే స్పందించారు. వెంటనే ఆయనను సమీపంలోని డెల్టా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి, వివిధ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆహారం వికటించడం లేదా తీవ్రమైన పని ఒత్తిడి వల్ల ఈ అస్వస్థత కలిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.