మూడు రోజుల సాంబార్‌పై గొడవ.. వివాహిత ఆత్మహత్య

  • మూడు రోజుల నాటి సాంబార్‌పై భర్తతో గొడవ
  • తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగిన 27 ఏళ్ల మహిళ
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి
  • బెంగళూరులో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు 
బెంగళూరులో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో వండిన పాత సాంబార్ విషయంలో భర్తతో జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... 27 ఏళ్ల కావ్యకు రంగస్వామితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం రోజున మూడు రోజుల క్రితం వండిన సాంబార్‌ను కావ్య మళ్లీ వేడి చేసి భర్తకు వడ్డించింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో భర్త ఆమెను దూషించి, దాడికి యత్నించినట్లు తెలుస్తోంది.

భర్త ప్రవర్తనతో తీవ్రంగా నొచ్చుకున్న కావ్య, ఇంట్లో వ్యవసాయానికి వాడే పురుగుల మందు తాగేసింది. కొద్దిసేపటి తర్వాత ఆమె వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్ప‌టికే కావ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.




More Telugu News