సుఖోయ్ ప్రమాదంలో... ఆపరేషన్ సిందూర్‌ పైలట్ మృతి

  • సుఖోయ్ యుద్ధ విమానం ప్రమాదంలో ఇద్దరు మృతి
  • ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఫ్లైట్ లెఫ్టినెంట్ దుర్గేశ్ దురాగ్‌కర్
  • దేశం కోసం పనిచేసిన కుమారుడిని చూసి గర్విస్తున్నానన్న తండ్రి
సుఖోయ్ యుద్ధ విమానం ప్రమాదంలో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న పైలట్ కూడా మృతి చెందారు. ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందగా, వారిలో ఒకరు ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దురాగ్‌కర్ ఉన్నారు. ఆయన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నారు.

పూర్వేశ్ మృతి చెందడంతో నాగపూర్‌లోని వారి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఆయన వయస్సు 28. ఈ మృతి వారి కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. పూర్వేశ్ తండ్రి రవీంద్ర దురాగ్‌కర్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. బుధవారం రోజే కుమారుడితో మాట్లాడామని, కానీ ఇంతలోనే ఈరోజు గ్రూప్ కెప్టెన్ ఫోన్ చేసి ఈ ప్రమాదం గురించి తెలియజేశాడని రవీంద్ర కంటతడిపెట్టారు. దేశానికి సేవ చేయాలనే మక్కువతో తన కుమారుడు యుద్ధ విమానం పైలట్‌గా మారాడాని అన్నారు. దేశం కోసం యుద్ధ విమానాలను నడిపిన తన కుమారుడిని చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు.

గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సిందూర్‌లో పూర్వేశ్ పాల్గొన్నారు.

తన కుమారుడు మొదట అసోంలోని తేజ్‌పూర్‌లో విధుల్లో చేరారని, అక్కడ రన్‌వే పనులు కొనసాగుతున్నందున తాత్కాలికంగా సుఖోయ్ ప్రమాదం జరిగిన జోర్హాట్ వైమానిక స్థావరం వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు తండ్రి వెల్లడించారు. యుద్ధ విమాన పైలట్‌గా తన అనుభవాలను తన కుమారుడు తనతో పంచుకునేవాడని వెల్లడించారు. "నా కుమారుడు భారత వైమానిక దళంలో భాగమైనందుకు గర్విస్తున్నాను" అని ఆ తండ్రి పేర్కొన్నారు.

పది రోజుల క్రితమే ఆ కుటుంబమంతా కలిసిందని, పూర్వేశ్ కూడా వచ్చారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. వీరి కుటుంబమంతా కలిసినప్పుడు పూర్వేశ్‌తో పాటు అమెరికాలో నివసిస్తున్న సోదరి కూడా నాగపూర్ వచ్చినట్లు తెలిపారు. పూర్వేశ్ నాగపూర్‌లోనే చదువుకున్నారు. అతనికి ఇంకా వివాహం కాలేదు.


More Telugu News