ఇలాంటి అవకాశం ఏ అధ్యక్షుడికీ రాలేదు.. మెస్సీపై ట్రంప్ ప్రశంసలు

  • ఎంఎల్ఎస్ ఛాంపియన్ ఇంటర్ మయామికి వైట్‌హౌస్‌లో సత్కారం
  • లియోనెల్ మెస్సీని ప్రత్యేకంగా అభినందించిన అధ్యక్షుడు ట్రంప్
  • అంచనాలను అందుకుని గెలవడం చాలా అరుదన్న ట్రంప్
  • రికార్డు స్థాయిలో గోల్స్ చేసి చరిత్ర సృష్టించిన ఇంటర్ మయామి
  • అమెరికాలో ఫుట్‌బాల్ సంస్కృతినే మార్చేశామన్న యాజమాన్యం
2025 మేజర్ లీగ్ సాకర్ (ఎంఎల్ఎస్) ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంటర్ మయామి జట్టుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ప్రత్యేకంగా అభినందించారు. చరిత్రలో ఏ అమెరికా అధ్యక్షుడికీ దక్కని గౌరవం తనకు దక్కిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ... "ఈ రోజు 2025 ఎంఎల్ఎస్ కప్ ఛాంపియన్స్ ఇంటర్ మయామికి ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఏ అమెరికా అధ్యక్షుడికీ దక్కని ఒక ప్రత్యేకమైన అవకాశం నాకు దక్కింది. లియోనెల్ మెస్సీ, వైట్‌హౌస్‌కు స్వాగతం" అని అన్నారు. మెస్సీ జట్టులోకి వచ్చిన తర్వాత ఇంటర్ మయామి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిందని కొనియాడారు.

"చాలా మంది అంతర్జాతీయ స్టార్లు అమెరికా లీగ్స్‌కు భారీ అంచనాలతో వస్తారు కానీ, టైటిల్స్ గెలవడంలో విఫలమవుతారు. కానీ, మెస్సీ వచ్చాడు, గెలిచాడు. ఇది చాలా అసాధారణమైన విషయం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంచనాలకు మించి రాణించడం, ఒత్తిడిని అధిగమించి గెలవడం మెస్సీకే సాధ్యమైందని ప్రశంసించారు. ఈ సీజన్‌లో ఇంటర్ మయామి జట్టు రికార్డు స్థాయిలో 101 గోల్స్ చేసిందని, ఫిఫా క్లబ్ వరల్డ్ కప్‌లో యూరోపియన్ జట్టును ఓడించి చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు.

రెగ్యులర్ సీజన్‌లోనే 29 గోల్స్ చేసిన మెస్సీ 'గోల్డెన్ బూట్' గెలుచుకున్నాడని, వరుసగా రెండోసారి లీగ్ ఎంవీపీగా ఎంపికైన తొలి ఆటగాడిగా నిలిచాడని తెలిపారు. ఇది మెస్సీ కెరీర్‌లో 47వ ట్రోఫీ అని, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని కొనియాడారు.

ఈ సందర్భంగా ఇంటర్ మయామి సహ యజమాని జార్జ్ మాస్ మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం ఇంటర్ మయామి కేవలం ఒక ఆలోచన మాత్రమేనని, మెస్సీ రాకతో జట్టు స్వరూపమే మారిపోయిందన్నారు. తమ ఆటగాళ్లు అమెరికాలో ఫుట్‌బాల్ సంస్కృతినే శాశ్వతంగా మార్చేశారని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో, ట్రంప్ జట్టు సభ్యులను, అధికారులను ఓవల్ ఆఫీస్‌కు ఆహ్వానించారు.


More Telugu News