హెచ్‌సీఏలో సమ్మె సైరన్ .. ఐపీఎల్ ముందు ఉద్యోగుల ఆందోళన

  • హెచ్‌సీఏలో నిరవధిక సమ్మెకు దిగిన ఉద్యోగులు
  • రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఓటీ, అలవెన్సుల చెల్లింపునకు డిమాండ్
  • హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ నియామక ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న సిబ్బంది
  • డిమాండ్లు నెరవేరే వరకు పనులు నిలిపివేస్తామని యూనియన్ హెచ్చరిక
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. తమ డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పనులను నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెలలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. 

హెచ్‌సీఏ సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ (హెచ్‌సీఏఎస్ఈ) ఆధ్వర్యంలో సుమారు 80 మంది సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఓవర్‌టైమ్ (ఓటీ) బకాయిలు, గ్రౌండ్ సిబ్బందికి ఇవ్వాల్సిన కన్వేయన్స్ అలవెన్సులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులందరికీ క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా కల్పించాలని, బయటి హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ నియామక ప్రతిపాదనను రద్దు చేయాలని కోరుతున్నారు. 

తమ సమస్యలపై యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. "అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నాం, ఇక మా ఓపిక నశించింది" అని వారు తెలిపారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమ్మె కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అంతరాయం కలిగితే, దానికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని యూనియన్ హెచ్చరించింది.


More Telugu News