అబుదాబిలో భారతీయుడికి బంపర్ లాటరీ ... మామూలు జాక్ పాట్ కాదు!

  • 15 మిలియన్ దిర్హమ్స్ (రూ. 37.5 కోట్లు) గెలుచుకున్న ప్రవాస భారతీయుడు విబీష్ పల్లియాలి
  • ఒకరోజు వాయిదా తర్వాత వెలువడిన డ్రా ఫలితాలు
  • విజేత ప్రకటనపై బిగ్ టికెట్ వెబ్‌సైట్‌లో నెలకొన్న గందరగోళం
గల్ఫ్ దేశంలో మరో ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. యూఏఈలోని షార్జాలో నివసిస్తున్న విబీష్ పల్లియాలి అనే వ్యక్తి అబుధాబి బిగ్ టికెట్ లాటరీలో ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్ (భారత కరెన్సీలో సుమారు రూ. 37.5 కోట్లు) గెలుచుకున్నారు. సిరీస్ 284 డ్రాలో భాగంగా ఆయన కొనుగోలు చేసిన టికెట్‌కు ఈ భారీ బహుమతి లభించింది. 

విబీష్ పల్లియాలి ఫిబ్రవరి 28న కొనుగోలు చేసిన 394150 నంబర్ గల టికెట్‌కు ఈ జాక్‌పాట్ తగిలినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వాస్తవానికి ఈ డ్రా మార్చి 3న జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఊహించని పరిణామాల కారణంగా డ్రాను ఒకరోజు వాయిదా వేసి, మార్చి 4న విజేతలను ప్రకటించారు.

ఇదిలా ఉండగా, బిగ్ టికెట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ డ్రాపై కొంత గందరగోళం నెలకొంది. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో విబీష్‌ను విజేతగా ప్రకటిస్తున్నప్పటికీ, 'ఆల్ విన్నర్స్' అనే మరో పేజీలో "మార్చి 2026లో ఎలాంటి డ్రా జరగలేదు" అని పేర్కొనడం గమనార్హం. ఈ వైరుధ్యంపై నిర్వాహకుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. లాటరీ గెలుచుకున్న విబీష్ పల్లియాలి నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
 


More Telugu News