అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ... కీలక రాడార్ స్టేషన్ ధ్వంసం చేసిన ఇరాక్!

  • మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
  • కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థలే ప్రధాన లక్ష్యం
  • ఏడు సైనిక స్థావరాల్లోని మౌలిక సదుపాయాలకు నష్టం
  • అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు
మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తీవ్ర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన కీలకమైన కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, ఖతార్ లో అమెరికాకు అత్యంత కీలకమైన రాడార్ స్టేషన్ ఇరాన్ దాడుల్లో ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్న ప్రాంతంలో ఈ దాడులతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం, కనీసం ఏడు అమెరికా సైనిక స్థావరాల్లోని కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. శాటిలైట్ చిత్రాలు, ధృవీకరించిన వీడియోల ఆధారంగా ఈ నివేదిక వెల్లడించింది. బాలిస్టిక్ క్షిపణులను గుర్తించే వ్యవస్థలు, శాటిలైట్ డిష్‌లు, సున్నితమైన పరికరాలను కాపాడే రాడోమ్‌ల వద్ద నష్టం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. అమెరికా సైనిక సమాచార వ్యవస్థ అత్యంత రహస్యంగా ఉన్నప్పటికీ, లక్ష్యాలను బట్టి చూస్తే వారి కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే ఇరాన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. వీటికి ప్రతీకారంగానే తాము ఈ దాడులు చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది.
గత జూన్‌లో కూడా ఖతార్‌లోని ఒక అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి చేసి కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే స్థావరంపై దాడి చేయడం గమనార్హం. ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులతో మధ్యప్రాచ్య సంక్షోభం మరింత తీవ్రమవుతోంది.


More Telugu News