రక్షణ రంగ కాంట్రాక్టర్లతో డొనాల్డ్ ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్!

  • రెండు రోజుల్లో అత్యవసర సమావేశం ఉండే అవకాశం
  • ఇరాన్‌తో యుద్ధం కారణంగా తగ్గుతున్న క్షిపణులు, ఆయుధ సామాగ్రి
  • ఆయుధ ఉత్పత్తిని త్వరితగతిన పెంచే అంశంపై చర్చించనున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్‌కు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌తో ఐదు రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. మరో నాలుగైదు వారాలు ఈ యుద్ధం కొనసాగవచ్చని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో అమెరికా వద్ద ఉన్న క్షిపణి, ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అత్యవసర సమావేశానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

రక్షణ రంగ కాంట్రాక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను ట్రంప్ శ్వేతసౌధానికి ఆహ్వానించినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఆయుధ ఉత్పత్తిని త్వరితగతిన పెంచే అంశంపై వారితో ఆయన చర్చించే అవకాశాలున్నాయి. రెండు రోజుల్లో ట్రంప్ వారితో భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా అమ్ములపొదిలో భారీగా క్షిపణులు తగ్గిపోయినట్లు పెంటగాన్ నివేదిక లీక్ అయింది. ఆయుధ కర్మాగారాన్ని తిరిగి నింపడానికి రక్షణ శాఖ పెంటగాన్ చర్యలు తీసుకుంటున్నట్లు కథనాలు వచ్చాయి. ఇందుకు భారీ మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశాయి. గత మూడు నాలుగేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్‌కు నాలుగేళ్లుగా అమెరికా ఆయుధాలు అందిస్తోంది. అమెరికా వద్ద ఆయుధాలు తగ్గిపోవడానికి ఇది కూడా కారణం.


More Telugu News