ఇరాన్ దాడిలో తెలంగాణ వాసికి గాయాలు
- అబుదాబి విమానాశ్రయంలో క్లీనింగ్ సెక్షన్లో పని చేస్తున్న రాజేశ్వర్ రావు
- మిస్సైల్ దాడిలో ఆయన చాతి, కుడి చేతికి గుచ్చుకున్న గాజుపెంకులు
- వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించిన అధికారులు
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడుల ప్రభావం గల్ఫ్ దేశాల్లోని భారతీయులపై పడుతోంది. అబుదాబి ఎయిర్పోర్ట్పై జరిగిన దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి గాయపడటం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళితే... రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నందెల్లి రాజేశ్వర్ రావు గత నాలుగేళ్లుగా అబుదాబి విమానాశ్రయంలో క్లీనింగ్ సెక్షన్లో పని చేస్తున్నాడు. నిన్న జరిగిన మిస్సైల్ దాడి సమయంలో ఎయిర్పోర్ట్ అద్దాలు పగిలి, ఆ గాజుపెంకులు రాజేశ్వర్రావు చాతి, కుడి చేతికి బలంగా తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను అక్కడి అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను గదికి పంపించినట్లు తన సోదరుడికి సమాచారం అందించారు.
అదే సమయంలో ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన దాడుల్లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్లకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం అబుదాబిలో విమాన రాకపోకలు నిలిచిపోవడంతో రాజేశ్వర్రావు అక్కడే చిక్కుకుపోయారు. తన భర్త పరిస్థితి తెలుసుకున్న భార్య మీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి, తన భర్తను సురక్షితంగా స్వగ్రామానికి రప్పించాలని ఆమె వేడుకుంటున్నారు.