శాంతి గురించి మాట్లాడితే కోపమా?.. ట్రోలర్స్‌కు నోరా ఫతేహి స్ట్రాంగ్ కౌంటర్

  • ప్రపంచ శాంతిపై తన వైఖరికి కట్టుబడి ఉన్నానన్న నోరా ఫతేహి
  • తనను విమర్శిస్తున్న ట్రోలర్స్‌కు సోషల్ మీడియాలో గట్టి కౌంటర్
  • శాంతి గురించి మాట్లాడితే కోపం వస్తే, మీలోనే సమస్య ఉందని వ్యాఖ్య
  • ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఆమె చేసిన వీడియోపై రేగిన వివాదం
ప్రపంచ శాంతి, ఐక్యతను కోరుతూ తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్న వారికి బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి గట్టిగా బదులిచ్చారు. తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో మరో వీడియోను విడుదల చేశారు.

 పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, ప్రపంచ శాంతికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ నోరా ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. దీనికి స్పందనగా నోరా తాజాగా మరో వీడియోను షేర్ చేశారు. "ప్రపంచ శాంతి, ఐక్యత అనే మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే.. దయచేసి సహాయం తీసుకోండి" అనే క్యాప్షన్‌తో ఆమె ఈ వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. "చాలా మందికి విషయాన్ని అర్థం చేసుకునే నైపుణ్యం, వినగలిగే సామర్థ్యం తగ్గిపోయినట్టుంది. శాంతియుతంగా జీవించాలని నేను ప్రపంచంలోని ప్రజలందరి గురించి మాట్లాడాను. గందరగోళానికి వ్యతిరేకంగా మాట్లాడాను. నా మాటలతో మీకు సమస్య ఉంటే, నైతికంగా మీలోనే ఏదో లోపం ఉన్నట్టు. మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న సంక్షోభాలతో ప్రజలు విసిగిపోయారని, తాను వారందరి తరఫున మాట్లాడానని నోరా వివరించారు. "నా మాటలు ఎవరినైనా బాధిస్తే లేదా చికాకు కలిగిస్తే, సమస్య నాలో కాదు.. ఆ సందేశాన్ని స్వీకరించలేని మీలోనే ఉంది. ప్రపంచ శాంతి గురించి మాట్లాడితే కోపం తెచ్చుకునే ప్రపంచంలో మనం జీవిస్తున్నామంటే అది చాలా భయానకమైన విషయం" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News