ఇండోనేషియాలో భారీ భూకంపం... భయంతో జనం పరుగులు

  • ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో భారీ భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదైనట్లు వెల్లడి
  • ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారుల ప్రకటన
  • సునామీ హెచ్చరికలు ఏవీ జారీ చేయని అధికారులు
  • పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' కారణంగా తరచూ భూకంపాలు
ఇండోనేషియాలోని సుమత్రా దీవి భూకంపంతో ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం 10:26 గంటలకు (భారత కాలమానం ప్రకారం) సుమత్రా దీవి పరిసరాల్లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ధృవీకరించింది. భూకంప కేంద్రం సముద్రంలో ఉన్నప్పటికీ, దీవిపై ప్రకంపనలు తీవ్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది.

భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు. అలాగే భవనాలు కూలిపోవడం గానీ, ఆస్తులకు భారీ నష్టం వాటిల్లడం గానీ జరగలేదు. సముద్రంలో భూకంపం రావడంతో సునామీపై ఆందోళన వ్యక్తమైనప్పటికీ.. అధికారులు మాత్రం సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు. ఎలాంటి సునామీ ప్రమాదం లేదని స్పష్టం చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇండోనేషియా పసిఫిక్ మహాసముద్రంలోని 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటం వల్లే ఇక్కడ తరచూ ఇలాంటి ప్రకంపనలు వస్తుంటాయి. టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రాంతం కావడంతో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోరణాలు ఇక్కడ సర్వసాధారణం. ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. 

ఇవాళ ఇరాన్ లోనూ 4.3 తీవ్రతతో భూకంపం సంభవించడం తెలిసిందే. 


More Telugu News