Mahesh Kumar Goud: నలుగురు బీసీ నేతలు రాజ్యసభ అవకాశం కోరుతున్నారు: మహేశ్ కుమార్ గౌడ్
- కార్పొరేట్లకే బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందన్న మహేశ్ గౌడ్
- తెలంగాణ కోసం పోరాడిన వారిని విస్మరించిందని విమర్శ
- లొంగిపోయిన మావోలు కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని వ్యాఖ్య
తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమర్థులైన నలుగురు బీసీ నేతలు రాజ్యసభ అవకాశం కోరుతున్నారని, ఒకటి లేదా రెండు స్థానాల కేటాయింపుపై రేపు స్పష్టత వస్తుందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ కేవలం కార్పొరేట్ శక్తులకే పెద్దల సభలో అవకాశం ఇచ్చిందని, తెలంగాణ కోసం పోరాడిన వారిని విస్మరించిందని ఆయన విమర్శించారు. అలాగే, మార్చి నెలలో కార్పొరేషన్ పదవుల భర్తీ ఉంటుందని వెల్లడించారు.
మావోయిస్టుల అంశంపై స్పందిస్తూ... దశాబ్దాలుగా సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వారి పట్ల తమకు గౌరవం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్తో చర్చలకు సిద్ధపడి, మావోయిస్టులతో చర్చలకు నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆపరేషన్ కగార్ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని పేర్కొంటూ, లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.