Nitin Menon: ఐసీసీ సెమీస్ ప్యానెల్‌లో ఇద్దరు భారతీయులు.. భారత్-ఇంగ్లండ్ కీలక పోరుకు అంపైర్లు వీరే!

Indias Nitin Menon among elite panel of match officials for ICC T20 WC semifinals
  • టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌కు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ
  • భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు గఫానీ, పాలేకర్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లు
  • ద‌క్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్‌కు నితిన్ మెనన్ థర్డ్ అంపైర్
  • మ్యాచ్ రిఫరీగా మరో భారతీయుడు జవగళ్ శ్రీనాథ్‌కు బాధ్యతలు
  • గత సెమీస్‌లో భారత్ గెలిచినప్పుడు గఫానీ అంపైరింగ్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కీలక దశకు చేరుకుంది. రేపు, ఎల్లుండి జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌ల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అఫీషియల్స్ జాబితాను విడుదల చేసింది. ఈ ఎలైట్ ప్యానెల్‌లో భారత అంపైర్ నితిన్ మెనన్‌తో పాటు మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్‌కు చోటు దక్కింది.

ఈ నెల‌ 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు క్రిస్ గఫానీ, అల్లావుద్దీన్ పాలేకర్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఏడ్రియన్ హోల్డ్‌స్టాక్ థర్డ్ అంపైర్‌గా, పాల్ రీఫిల్ ఫోర్త్ అంపైర్‌గా, ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 2024లో ఇదే జట్ల మధ్య జరిగిన సెమీస్‌కు గఫానీ అంపైర్‌గా ఉన్నారు. ఆ మ్యాచ్‌లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలోనూ గఫానీ భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లకు, పాలేకర్ ఒక మ్యాచ్‌కు అంపైరింగ్ చేశారు.

ఇక, రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఉంటారు. ఈ మ్యాచ్‌లో భారత అంపైర్ నితిన్ మెనన్ థర్డ్ అంపైర్‌గా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. రాడ్ టక్కర్ ఫోర్త్ అంపైర్‌గా, మరో భారతీయుడైన జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు.

రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్‌లో గెలిచిన మ్యాచ్‌కు ఇల్లింగ్‌వర్త్ అంపైర్‌గా వ్యవహరించగా, ఈ టోర్నీ గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్ ఆడిన మ్యాచ్‌కు వార్ఫ్ అంపైరింగ్ చేశారు. దీంతో అత్యంత కీలకమైన సెమీస్ పోరులకు అనుభవజ్ఞులైన అఫీషియల్స్‌నే ఐసీసీ నియమించినట్లయింది.
Nitin Menon
ICC T20 World Cup
India vs England
Cricket Umpires
Javagal Srinath
Chris Gaffaney
Richard Illingworth
T20 Semifinals
Cricket Officials

More Telugu News