భారత ప్రధానికి నెతన్యాహు థ్యాంక్స్

  • భారత ప్రధాని మోదీతో ఫోన్ లో సుదీర్ఘ చర్చలు..
  • ఇజ్రాయెల్‌కు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు
  • ఇరాన్ దాడిలో ధ్వంసమైన సినగాగ్ సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని
ఇరాన్ క్షిపణి దాడులతో అట్టుడుకుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెన్జమిన్ నెతన్యాహు సోమవారం ప్రజల ముందుకు వచ్చారు. ఇరాన్ దాడుల్లో తొమ్మిది మంది మరణించిన ‘బెయిట్ షెమేష్’ ప్రాంతంలోని ధ్వంసమైన ప్రార్థనా మందిరాన్ని (సినగాగ్) ఆయన సందర్శించారు. భారీ భద్రత నడుమ శిథిలాల మధ్య నడుస్తూ ఆయన అక్కడి దృశ్యాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు.

మోదీ మాకు గొప్ప మిత్రుడు..
ఈ సందర్భంగా నెతన్యాహు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను జరిపిన సంభాషణ గురించి ప్రస్తావించారు. ‘‘నేను మా గొప్ప మిత్రుడు నరేంద్ర మోదీతో నిన్న సుదీర్ఘంగా మాట్లాడాను. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచినందుకు, సత్యం వైపు నిలబడినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను. భారత ప్రజల స్నేహాన్ని మేము ఎంతో గౌరవిస్తాం. ఇజ్రాయెల్‌ లో భారతీయులంటే ఎంతో అభిమానం ఉంది’’ అని చెప్పారు.

మళ్ళీ క్షిపణుల గర్జన..
సోమవారం సాయంత్రం కూడా ఇరాన్ పలు క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ధ్రువీకరించింది. తమ రక్షణ వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయని, ప్రమాదం కలగకముందే మూడు క్షిపణులను గాలిలోనే ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. మొబైల్ ఫోన్లకు అలర్ట్ వచ్చిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు లోపలే ఉండాలని అధికారులు హెచ్చరించారు.


More Telugu News