జోస్యం తప్పినా తగ్గలేదు.. టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!

  • జోస్యం తప్పడంతో ట్రోలింగ్ బారినపడ్డ పాక్ మాజీ బౌలర్ మహమ్మద్ ఆమిర్
  • టీమిండియా ఆటతీరు బాగోలేదని, ఫేవరెట్ కాదని కొత్త వ్యాఖ్యలు
  • ఫీల్డింగ్, బుమ్రా మినహా బౌలింగ్ పేలవంగా ఉందని విమర్శ
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీఫైనల్‌కు కూడా చేరదని జోస్యం చెప్పి, అది తప్పడంతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ బారినపడ్డ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సెమీస్‌కు దూసుకెళ్లినప్పటికీ భారత్ ఆటతీరు ఏమాత్రం బాగోలేదని, ఈ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్ కాదని కొత్త వ్యాఖ్యలు చేశాడు.

"హార్నా మనా హై" అనే టీవీ షోలో ఆమిర్ మాట్లాడుతూ.. "క్రికెట్ పరంగా విశ్లేషిస్తే, భారత్ మంచి క్రికెట్ ఆడటం లేదు. వాళ్ల ఫీల్డింగ్ చూడండి. కనీసం 3-4 క్యాచ్‌లు వదిలేశారు. బుమ్రా మినహా ప్రతీ బౌలర్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. పెద్ద జట్లపై హార్దిక్ పాండ్యా ఎప్పుడూ రాణించడని నేను ముందే చెప్పాను. అతను 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. సెమీఫైనల్‌కు చేరిన జట్లు స్పిన్నర్లను బాగా ఆడతాయి" అని విమర్శించాడు.

అలాగే, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోని ఒక వివాదాన్ని ఆమిర్ తెరపైకి తెచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో హెట్‌మైర్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడంపై మాట్లాడుతూ.. "హెట్‌మైర్ ఔట్ వివాదాస్పదం అని నేను భావిస్తున్నాను. అతను ఔటయ్యాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అతను మరికొంత సేపు క్రీజులో ఉండి, స్కోరు 220-230కి చేరి ఉంటే, ఈరోజు భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించేది" అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా, గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.


More Telugu News