ఘనంగా శిరీష్, నయనికా ప్రీ వెడ్డింగ్ వేడుక.. తరలివచ్చిన టాలీవుడ్

  • అల్లు శిరీష్, నయనికాల వివాహ వేడుకలు ప్రారంభం
  • ఈ నెల‌ 6న పెళ్లి.. ఘనంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్
  • అన్నగా బాధ్యతలు నిర్వర్తించిన అల్లు అర్జున్
  • అయ్యప్ప మాలలో హాజరైన రామ్ చరణ్.. ప్రత్యేక ఆకర్షణగా బాలకృష్ణ
టాలీవుడ్‌లో మరో మెగా కుటుంబ వేడుకకు రంగం సిద్ధమైంది. అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. ప్రముఖ నటుడు అల్లు శిరీష్, నయనికాల వివాహం మార్చి 6న జరగనుండగా, నిన్న‌ రాత్రి హైదరాబాద్‌లో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల రాకతో ఈ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. సంప్రదాయం, ఆధునికత మేళవించిన అలంకరణలతో వేదిక కనులవిందు చేసింది.

సోదరుడి వివాహ వేడుక కావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. వేడుకకు వచ్చిన ప్రతి అతిథిని పేరుపేరునా ఆత్మీయంగా పలకరిస్తూ అన్నగా తన బాధ్యతను నిర్వర్తించారు. ఆయన అర్ధాంగి స్నేహా రెడ్డి కూడా సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అతిథులతో ముచ్చటిస్తూ కనిపించారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప మాలలో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ రిసెప్షన్‌లో మరో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఒకేచోట కూర్చుని సరదాగా ముచ్చటించుకోవడం కెమెరాల కంటపడింది. వీరిద్దరి మధ్య నవ్వులు అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి. వీరితో పాటు కింగ్ నాగార్జున, ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు, నాని, సాయి ధరమ్ తేజ్ వంటి అగ్ర తారలు హాజరై సందడి చేశారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తనదైన శైలిలో నవ్వులు పూయించారు.

దర్శకుడు బుచ్చిబాబు సన, హీరో శ్రీ విష్ణు, నటుడు అలీ, యాంకర్ సుమ కనకాల వంటి పలువురు ప్రముఖులు కూడా హాజరై కాబోయే వధూవరులు శిరీష్-నయనికా జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకే వేదికపై టాలీవుడ్ తారలంతా మెరవడంతో ఈ వేడుక తారల సమ్మేళనాన్ని తలపించింది. అద్భుతమైన అలంకరణ, ప్రముఖుల రాకతో ఈ రిసెప్షన్ ఈ ఏడాది జరిగిన అత్యంత వైభవమైన వేడుకల్లో ఒకటిగా నిలిచింది. ఈ నెల‌ 6న జరగనున్న వీరి వివాహం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


More Telugu News