రూ. 600ల కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమికి హైడ్రా రక్షణ

  • గంధంగూడలో 6.30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హైడ్రా
  • ఐటీ కారిడార్ సమీపంలో రూ.600 కోట్ల విలువైన భూమి రక్షణ
  • జలమండలికి కేటాయించిన స్థలంలో షెడ్ల తొలగింపు
  • ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసిన అధికారులు
  • సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ కోసం గతంలోనే స్థల కేటాయింపు
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉన్న గంధంగూడ ప్రాంతంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించింది. సుమారు రూ.600 కోట్ల విలువ చేసే 6.30 ఎకరాల స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 86/పి లో ఉన్న 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలోనే జలమండలికి కేటాయించింది. అయితే, ఈ విలువైన స్థలంపై కన్నేసిన కొందరు అక్రమార్కులు రకరకాల పేర్లతో ఆక్రమణలకు పాల్పడుతూ వచ్చారు. అంతేకాకుండా, ఆ స్థలంలో అనధికారికంగా షెడ్లను కూడా నిర్మించి కబ్జా చేశారు.

ఈ విషయంపై జలమండలి అధికారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పక్కాగా సర్వే నిర్వహించింది. ఇది ప్రభుత్వ భూమేనని నిర్ధారించుకున్న అనంతరం, అక్కడ వెలసిన అక్రమ నిర్మాణాలను, షెడ్లను అధికారులు కూల్చివేశారు. ఆక్రమణలన్నీ తొలగించిన తర్వాత మొత్తం 6.30 ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఆక్రమణలకు తావులేకుండా ఇది ప్రభుత్వ స్థలం అని స్పష్టం చేస్తూ హైడ్రా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది.


More Telugu News