Revanth Reddy: 19 ఏళ్లలో జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రిని అయ్యా: రేవంత్ రెడ్డి

Revanth Reddy From ZPTC to CM in 19 Years
  • రాజకీయాల్లో ఎప్పుడూ ప్రజా సమస్యల పైనే గళమెత్తానన్న ముఖ్యమంత్రి
  • తన మీద కేసులు పెట్టారని, కోర్టుకు వెళ్లారని గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి
  • రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యమని వ్యాఖ్య
తాను 19 ఏళ్లలో జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రిని అయ్యానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ఏపీసీసీ చీఫ్ షర్మిల తదితరులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను రాజకీయాల్లో ఎప్పుడూ ప్రజా సమస్యలపై గళమెత్తానని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పైరవీలు చేయలేదని తెలిపారు. తన మీద అనేక కేసులు పెట్టారని, కోర్టుకు కూడా వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త లక్ష్యం కూడా అదేనని అన్నారు.

దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, రాహుల్ గాంధీ అనేక సమస్యలపై పోరాటం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్,కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Revanth Reddy
Telangana CM
Rahul Gandhi
Congress Party
Political Affairs Committee
Vikarabad

More Telugu News