ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా రికార్డు ఘనం... నేడు విండీస్‌తో కీలక పోరు

  • టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో నేడు విండీస్‌తో భారత్ కీలక పోరు
  • ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియాకు సెమీస్ బెర్తు ఖాయం
  • ఈడెన్ గార్డెన్స్‌లో 2011 తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఓడని భారత్
  • కోల్‌కతా వేదికగా విండీస్‌పై ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ మనదే విజయం
  • నేటి మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడే అవకాశం
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 చివరి అంకానికి చేరుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్... నేటి సాయంత్రం వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇప్పటికే మూడు జట్లు సెమీస్ చేరగా, చివరి బెర్తు ఎవరిదో ఈ మ్యాచ్‌తో తేలిపోనుంది. జింబాబ్వేపై విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియాకు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. ఇందులో గెలిస్తే భారత్ దర్జాగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు వెళితే.. అక్కడ గ్రూప్-2 టాపర్ ఇంగ్లాండ్‌తో తలపడే అవకాశాలు ఉన్నాయి.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటం భారత్‌కు కలిసివచ్చే అంశం. ఈ మైదానంలో మెన్ ఇన్ బ్లూకి తిరుగులేని రికార్డు ఉంది. 2011 అక్టోబర్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి మినహా.. ఆ తర్వాత ఇక్కడ ఆడిన ఏడు టీ20 మ్యాచుల్లోనూ టీమిండియానే వరుస విజయాలు సాధించింది. 2016 నుంచి ఇక్కడ భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ముఖ్యంగా ఈ మైదానంలో వెస్టిండీస్‌పై భారత్ రికార్డు అద్భుతం. ఇక్కడ విండీస్‌తో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చివరగా 2022 ఫిబ్రవరిలో ఇక్కడ విండీస్‌ను భారత్ ఓడించింది.

అయితే 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే మైదానంలో ఇంగ్లాండ్‌ను ఓడించి విండీస్ టైటిల్ గెలిచిన సంగతి మరువకూడదు. ఆ జట్టుకు కూడా ఈ వేదికపై మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. అయినప్పటికీ, గణాంకాలు మాత్రం భారత్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఓవరాల్‌గా ఇరు జట్లు 30 సార్లు తలపడగా.. భారత్ 19 సార్లు, విండీస్ 10 సార్లు గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది.


More Telugu News