కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- గేట్లు బద్దలుకొట్టి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారుల ప్రయత్నం
- ఖమేనీ మృతితో ఉగ్రరూపం దాల్చిన నిరసనకారులు
- కాన్సులేట్ ప్రధాన భవనంపై రాళ్ల వర్షం.. పోలీసుల లాఠీఛార్జ్
- ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన కరాచీ
కాన్సులేట్ వెలుపల భారీగా మోహరించిన పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు పోలీసులపైకి విచక్షణారహితంగా రాళ్లు రువ్వగా, వారిని చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కొన్ని వీడియో దృశ్యాల ప్రకారం.. అనేకమంది నిరసనకారులు కాన్సులేట్ ప్రధాన గేట్లను బద్దలుకొట్టి కాంపౌండ్లోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న భవనం కిటికీ అద్దాలు, తలుపులను ధ్వంసం చేస్తూ లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో కరాచీలోని దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ సెగలు ఇప్పుడు పొరుగున ఉన్న పాకిస్థాన్కు కూడా పాకడంతో, అక్కడ ఉన్న విదేశీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు పాక్ అధికారులు వెల్లడించారు.