మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం... బంగారం, వెండి ధరలు దూసుకుపోతాయంటున్న నిపుణులు

  • ఇజ్రాయెల్ - ఇరాన్ ఉద్రిక్తతలతో బంగారం, వెండి ధరలకు రెక్కలు
  • సోమవారం మార్కెట్ గ్యాప్-అప్ ఓపెనింగ్ ఉంటుందన్న నిపుణులు
  • దేశీయ మార్కెట్లో తులం బంగారం రూ.1.70 లక్షలకు చేరే అవకాశం
  • కిలో వెండి రూ.2.95 లక్షల వరకు వెళ్లే ఛాన్స్
  • సురక్షిత పెట్టుబడి వైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సోమవారం నాటికి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే (గ్యాప్-అప్) అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

శనివారం నాడు ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు క్షిపణి దాడులు చేయడంతో టెహ్రాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల కంటే సురక్షితమైన బంగారం, వెండి వంటి 'సేఫ్ హెవెన్' ఆస్తుల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఈ డిమాండ్ కారణంగా సోమవారం మార్కెట్ ప్రారంభంలోనే పసిడి, వెండి ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి.

టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే.. అంతర్జాతీయ మార్కెట్ (COMEX)లో బంగారం ఔన్సు ధర 5,300 డాలర్ల వద్ద నిరోధం ఎదుర్కొంటోంది. ఒకవేళ ఈ స్థాయిని దాడితే, దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.1,68,000 నుంచి రూ.1,70,000 వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఎంసీఎక్స్ (MCX)లో బంగారం ధర రూ.1,62,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. రూ.1,60,000 మార్కు పైన నిలదొక్కుకుంటే, స్వల్పకాలంలోనే ఇది రూ.1,63,500 నుంచి రూ.1,65,000 స్థాయికి చేరవచ్చు.

మరోవైపు వెండి ధరల్లోనూ బలమైన ర్యాలీ కనిపిస్తోంది. ఎంసీఎక్స్ సిల్వర్ ఇప్పటికే కీలక బ్రేక్-అవుట్ ఇచ్చింది. ఇదే జోరు కొనసాగితే వెండి ధర కిలో రూ.2,80,000 నుంచి రూ.2,85,000 రేంజ్‌కు వెళ్లే అవకాశముంది. మద్దతు స్థాయిల పైన ధరలు నిలబడితే ఏకంగా రూ.2,90,000 నుంచి రూ.2,95,000 వరకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగడం, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అక్కడి రక్షణ దళాలు హెచ్చరికలు జారీ చేయడం యుద్ధ భయాలను మరింత పెంచుతోంది.




More Telugu News