తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... డీఎంకేతో కాంగ్రెస్ చర్చలు

  • సీట్ల పంపకాలపై చర్చించేందుకు డీఎంకే కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు
  • టీఆర్ బాలు నేతృత్వంలోని డీఎంకే ప్యానెల్‌తో చర్చలు
  • 35 సీట్లు ఆశిస్తున్న కాంగ్రెస్
  • 28కి మించి ఇచ్చేందుకు ఆసక్తిగా లేని డీఎంకే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల సంఘం ఎప్పుడైనా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు సీట్ల పంపకాలపై చర్చలు ప్రారంభించాయి.

ఏఐసీసీ తమిళనాడు ఇన్‌ఛార్జ్ గిరీశ్ చోదంకర్, టీఎన్‌సీసీ చీఫ్ సెల్వపెరుంతగై, ఏఐసీసీ కో ఇన్‌ఛార్జ్ నివేదితా ఆల్వా చెన్నైలోని డీఎంకే కార్యాలయానికి చేరుకున్నారు. డీఎంకే సీనియర్ నాయకుడు టీఆర్ బాలు నేతృత్వంలోని ప్యానెల్ వారితో చర్చలు జరపనుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి డీఎంకే 25 సీట్లు కేటాయించింది. ఈసారి 35 సీట్లు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. అలాగే రెండు రాజ్యసభ స్థానాలను కూడా అడుగుతోంది. డీఎంకే మాత్రం 27 లేదా 28 సీట్లు, ఒక రాజ్యసభ స్థానం ఇస్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది.

సీట్ల పంపకాలలో అసంతృప్తి ఏర్పడి డీఎంకే, కాంగ్రెస్ పొత్తు విఫలమైతే నటుడు విజయ్ స్థాపించిన టీవీకేతో కలిసి వెళ్లే అవకాశాన్ని కాంగ్రెస్ పరిశీలించవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు విజయ్ కూడా సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది.


More Telugu News