తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!

  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • సర్వదర్శనానికి 15 గంటల సమయం అంచనా
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,952 మంది భక్తులు
  • హుండీ ద్వారా రూ. 3.97 కోట్ల ఆదాయం
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, భక్తుల క్యూలైన్లు వెలుపల ఉన్న కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు బారులు తీరాయి. 

టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం, శుక్రవారం (ఫిబ్రవరి 27) ఒక్కరోజే 67,952 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 27,414 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ వెల్లడించింది. 
 
 


More Telugu News