Shahid Afridi: టీమిండియాపై మరోసారి విషం చిమ్మిన ఆఫ్రిది
- ఇండియాకు సెమీఫైనల్ చేరే అర్హత లేదన్న ఆఫ్రిది
- కేవలం చిన్న జట్లపై మాత్రమే గెలిచిందని విమర్శ
- దక్షిణాఫ్రికాపై పూర్తిగా తేలిపోయిందని వ్యాఖ్య
టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతున్న వేళ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది భారత జట్టుపై విమర్శలు గుప్పించాడు. టోర్నీలో టీమిండియా ప్రదర్శనను తక్కువ చేస్తూ, భారత్కు సెమీఫైనల్ చేరే అర్హత లేదంటూ ఎప్పటి మాదిరే విద్వేషాన్ని వ్యక్తం చేశాడు.
లీగ్ దశ, సూపర్-8లో భారత్ సాధించిన విజయాలను... 'అసలు విజయాలే కావన్నట్టు' ఆఫ్రిది కొట్టిపారేశాడు. టీమిండియా కేవలం చిన్న జట్లపై మాత్రమే గెలుస్తూ టోర్నీ స్థాయిని దిగజారుస్తోందని విమర్శించాడు. "దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను ఎదుర్కొన్నప్పుడు భారత్ పూర్తిగా తేలిపోయింది. అమెరికాపై సూర్యకుమార్ యాదవ్ ఆడకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పాక్తో మ్యాచ్లోనూ భారత్ది అదృష్ట విజయమే" అని ఎద్దేవా చేశాడు.
టోర్నీలో భారత్ కంటే వెస్టిండీస్ జట్టే అద్భుతమైన ప్రదర్శన చేసిందని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్ చేరేందుకు కరేబియన్లకే 100 శాతం అర్హత ఉందని అన్నాడు. మరోవైపు, ఆఫ్రిది వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారత అభిమానులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. పాక్ జట్టు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆఫ్రిది భారత్పై అసూయతో మాట్లాడుతున్నాడని విమర్శిస్తున్నారు.