రింకూ సింగ్ తండ్రి మృతి.. విరాట్ కోహ్లీ భావోద్వేగ సందేశం

  • టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖాంచంద్ సింగ్ కన్నుమూత
  • టీ20 ప్రపంచకప్‌ను వదిలి తండ్రి అంత్యక్రియలకు హాజరైన రింకూ
  • తండ్రి పాడె మోసి కన్నీటి వీడ్కోలు పలికిన యువ బ్యాటర్
  • విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులు, బీసీసీఐ సంతాపం
టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖాంచంద్ సింగ్ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, ఆరోగ్యం విషమించడంతో గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

తండ్రి మరణవార్త తెలియగానే, టీ20 ప్రపంచకప్ కోసం చెన్నైలో ఉన్న రింకూ సింగ్ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. అలీగఢ్‌లో జరిగిన తన తండ్రి అంతిమయాత్రలో పాల్గొని, పాడె మోసి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ దృశ్యాలు పలువురిని కదిలించాయి. 

ఈ విషాద ఘటనపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎక్స్ వేదికగా స్పందించాడు. "రింకూ తండ్రి మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ కష్టకాలంలో నా ప్రార్థనలు నీకు, నీ కుటుంబానికి ఉంటాయి. ఆయన ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి. ఓం శాంతి" అని కోహ్లీ పోస్ట్ చేశాడు.

రింకూ సింగ్ తదుపరి సూపర్ 8 మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో పాటు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ప్రేమ్ మనోహర్ గుప్తా కూడా సంతాపం వ్యక్తం చేశారు. "రింకూ కుటుంబంలో ఇప్పుడిప్పుడే సంతోషాలు నిండుతున్నాయి. ఇటీవలే అతని వివాహం కూడా నిశ్చయమైంది. ఇలాంటి సమయంలో ఈ నష్టం మరింత బాధాకరం" అని ప్రేమ్ మనోహర్ పేర్కొన్నారు.


More Telugu News