దూకుడుగా వస్తే అణచివేస్తాం.. ఆఫ్ఘన్‌కు పాక్ ప్రధాని హెచ్చరిక

  • ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ దాడుల తర్వాత షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు
  • కాబూల్, కాందహార్‌లపై పాకిస్థాన్ వైమానిక దాడులు
  • సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతలు.. ఇరువైపులా భారీ ప్రాణనష్టం
  • సైన్యానికి దేశం మొత్తం అండగా ఉందని స్పష్టం చేసిన షరీఫ్
దూకుడుగా వ్యవహరించాలని చూసే ఎలాంటి దురాక్రమణనైనా అణచివేసే పూర్తి సామర్థ్యం తమ సాయుధ బలగాలకు ఉందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రధాన నగరాలపై పాక్ దళాలు దాడులు జరిపిన కొన్ని గంటల తర్వాత ఆయన ఇవాళ‌ ఈ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.

నిన్న‌ రాత్రి ఆఫ్ఘన్ దళాలు పాక్ సరిహద్దు సైనికులపై దాడి చేయడంతో, దానికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్, కాందహార్ నగరాలే లక్ష్యంగా పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల అనంతరం పాక్ ప్రభుత్వ అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా షరీఫ్ తన సందేశాన్ని విడుదల చేశారు.

ఇటీవలి కాలంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాజా ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన పదుల సంఖ్యలో సైనికులు మరణించినట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సాయుధ బలగాలకు దేశ ప్రజలందరి మద్దతు ఉందని, యావత్ జాతి సైన్యానికి అండగా నిలుస్తుందని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.


More Telugu News