వయనాడ్‌లో 100 ఇళ్లు... శంకుస్థాపన వేళ సరదా అంశం పంచుకున్న రాహుల్ గాంధీ

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కలిసి బాధితుల కోసం నిర్మించనున్న 100 ఇళ్ల నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. చురల్మల-ముండక్కాయ్ విపత్తు బాధితులకు ఈ ఇళ్లను నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ విపత్తు వయనాడ్ ప్రజల ధైర్యాన్ని, మానవత్వాన్ని ప్రపంచానికి చూపిందన్నారు. "మీరు చాలా కోల్పోయారు, కానీ మీ ధైర్యాన్ని, మానవత్వాన్ని కోల్పోలేదు" అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన తన సోదరి ప్రియాంకతో ప్రయాణంలో జరిగిన ఓ సరదా సంఘటనను పంచుకున్నారు. "నేను మా సోదరితో సరదాగా ఏదో అన్నాను. అప్పటి నుంచి ఆమె నాతో మాట్లాడటం లేదు. ఇక్కడికి ఫ్లైట్‌లో వచ్చేంత వరకు ముభావంగానే ఉంది. కానీ వయనాడ్‌లో అడుగుపెట్టగానే ఆమె మారిపోయింది. మాకు వయనాడ్ అంటే అదే!" అని చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి. ఈ ప్రాంతంతో తమకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని ఆయన స్పష్టం చేశారు. 

ప్రియాంక గాంధీ మాట్లాడుతూ... జూలై 30న విపత్తు జరిగిన వెంటనే తాను ఈ ప్రాంతానికి వచ్చినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "ఆ రోజు నేను చూసిన దృశ్యాలు నా జీవితంలో మర్చిపోలేను" అని అన్నారు. ఇళ్లు, జీవనోపాధి, వ్యాపారాలు కోల్పోయిన కుటుంబాల పరిస్థితి తనను కలచివేసిందని చెప్పారు. అప్పటికి, ఇప్పటికి తాను మీ కుటుంబంలో ఒకరిగా మారిపోయానని భావోద్వేగంగా అన్నారు.

ఈ సమస్యను పార్లమెంటులో ప్రస్తావించామని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరామని ప్రియాంక తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి నిలిచారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతి కుటుంబానికి 8 సెంట్ల స్థలంలో 1,100 చదరపు అడుగుల ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. అలాగే, నష్టపోయిన 40 మంది దుకాణదారులు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించుకోవడానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.



Rahul Gandhi
Priyanka Gandhi
Wayanad
Kerala Floods
House Construction
Disaster Relief
Congress Party
Amit Shah
National Disaster

More Telugu News