యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. కలచివేస్తున్న డైరీలోని చివరి మాటలు

  • హైదరాబాద్‌లో యూట్యూబర్ బోను కోమలి అనుమానాస్పద మృతి
  • ఆత్మహత్యకు ముందు తన డైరీలో రాసిన చివరి నోట్ వెలుగులోకి
  • ప్రియుడితో బ్రేకప్ కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానం
  • కువైట్‌లో ఉన్న తల్లికి చివరిసారిగా మెసేజ్ పంపిన కోమలి
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్‌లో సోమవారం ఓ యువ యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. విశాఖపట్నంకు చెందిన బోను కోమలి (21) నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతూ, పార్ట్‌టైమ్‌ యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తాను అద్దెకు ఉంటున్న ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ విఫలం కావడమే ఆమె మరణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఆమె రాసిన ఓ డైరీ నోట్ పోలీసులకు లభించింది. 

"ముందుకు సాగిపోవాలంటే భయంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ అతను తిరిగి వస్తే? నేను అతడిని వదిలేయాలని తెలుసు. అతను నా వాడు కాదని కూడా నాకు తెలుసు. నాతో ఉండటానికి అతను ప్రయత్నించడం లేదనీ తెలుసు. అయినా నాలోని ఏదో ఒక భాగం అతని కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. ఏదో ఒక రోజు అతను నన్ను ఎంచుకుంటాడని ఆశిస్తూనే ఉంది" అని కోమలి తన డైరీలో ఆవేదన వ్యక్తం చేసింది. తాను పూర్తిగా దూరంగా వెళ్లిపోయిన తర్వాత, అతను వెనక్కి తిరిగి తన కోసం చూస్తే ఏం చేయాలనే భయం తనను వెంటాడుతోందని ఆ నోట్‌లో రాసింది.

కోమలి గత మూడేళ్లుగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్/యూట్యూబర్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. అయితే, కొన్నాళ్ల క్రితం వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం కూడా ఆమె ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

సోమవారం తెల్లవారుజామున కువైట్‌లో పనిచేస్తున్న తన తల్లి సత్య వరలక్ష్మికి "ఐ లవ్యూ మమ్మీ సో మచ్" అని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని కోమలి మెసేజ్ పంపింది. ఆ తర్వాత ఆమె ఫోన్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తల్లి, హైదరాబాద్‌లోని స్నేహితులకు సమాచారం ఇచ్చారు. వారు మధ్యాహ్నం ఫ్లాట్‌కు వెళ్లి చూడగా, తలుపులు మూసి ఉన్నాయి. పోలీసుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, కోమలి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. ఘటనా స్థలంలో ఓ నిచ్చెనను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుప‌త్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోమలి ఫోన్ రికార్డులు, మెసేజ్‌లు, స్నేహితుల వాంగ్మూలాలను సేకరించి ఆత్మహత్యకు దారితీసిన పూర్తి పరిస్థితులను విశ్లేషిస్తున్నారు. లైఫ్‌స్టైల్, వ్లాగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన కోమలి, ఇటీవల తిరుమలకు పాదయాత్ర చేసిన వీడియోతో వైరల్ అయింది. అదే ఆమె చివరి పోస్ట్ కావడం పలువురిని కలిచివేస్తోంది.




More Telugu News