ప్రేమ పెళ్లికి నిరాకరించిందని బావ.. ఆ వార్త విని మరదలు బలవన్మరణం!

  • వనపర్తి, బాసర ట్రిపుల్ ఐటీలో వేర్వేరుగా ఘటనలు
  • ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం
  • ఘటనపై కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు
ప్రేమ వ్యవహారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెళ్లికి నిరాకరించిందన్న మనస్తాపంతో బావ ఆత్మహత్య చేసుకోగా, ఆ వార్త తట్టుకోలేక మరదలు కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటనలు వనపర్తి, నిర్మల్ జిల్లాల్లో తీవ్ర కలకలం రేపాయి.

వనపర్తి జిల్లా అప్పాయిపల్లికి చెందిన గణేశ్ నాయక్ (21) హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి మేనత్త కుమార్తె, నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్న వసంత (18)తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవల పెళ్లి చేసుకోవాలని గణేశ్ ప్రతిపాదించగా వసంత సున్నితంగా తిరస్కరించింది. దీంతో మనస్తాపం చెందిన గణేశ్, మంగళవారం రాత్రి తన స్వగ్రామంలోని ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

బావ మరణవార్త తెలియడంతో వసంత తీవ్ర ఆందోళనతో పాటు అపరాధ భావనకు లోనైంది. ఈ క్రమంలో బుధవారం తన హాస్టల్ గదిలో మొదట చేతి మణికట్టును కోసుకుని, ఆపై ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వసంత గతంలోనూ రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.

కూలి పనులు చేసుకుంటూ కూతురిని ఇంజనీర్‌గా చూడాలనుకున్న వసంత తల్లిదండ్రులు ఆమె మరణంతో కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని గణేశ్ తండ్రి రత్ననాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


More Telugu News