ఉదయ్‌పూర్‌లో 'విరోష్' వెడ్డింగ్ సందడి.. తెలంగాణ, కర్ణాటక వంటకాలతో అతిథులకు ప్రత్యేక విందు

  • ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మికల పెళ్లి
  • రెండు కుటుంబాల సంప్రదాయాల ప్రకారం హిందూ, కొడవ పద్ధతుల్లో వివాహం
  • ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసిన పలువురు టాలీవుడ్ దర్శకులు, ప్రముఖులు
  • హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. రెండు కుటుంబాల సంప్రదాయాలకు గౌరవమిస్తూ రెండు పద్ధతుల్లో పెళ్లి చేస్తుండటం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు హాజరయ్యేందుకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారు.

ఇవాళ‌ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం విజయ్-రష్మికల వివాహం జర‌గ‌నుంది. వేదమంత్రాల సాక్షిగా, పట్టువస్త్రాల్లో ఈ జంట ఒక్కటి కానుంది. అలాగే సాయంత్రం రష్మిక కుటుంబ సంప్రదాయమైన 'కొడవ' (కూర్గ్) ఆచారం ప్రకారం మరోసారి పెళ్లి తంతు నిర్వహించనున్నారు. ఇందుకోసం కూర్గ్ ప్రత్యేక దుస్తులు, సంప్రదాయాలతో ఏర్పాట్లు చేశారు. రెండు వేడుకలతో ఈ డబుల్ వెడ్డింగ్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వివాహ వేడుకలకు ముందు ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. విజయ్, రష్మికలకు అత్యంత సన్నిహితులైన దర్శకులు సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, తరుణ్ భాస్కర్ సహా నటుడు రాహుల్ రవీంద్రన్, ఆషికా రంగనాథ్ వంటి ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. 'VIROSH' (Vijay-Rashmika) పేరుతో చేసిన ప్రత్యేక డెకరేషన్ అందరినీ ఆకట్టుకుంది.

ఉదయ్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలాసవంతమైన ఐటీసీ మెమంటోస్ రిసార్ట్‌లో ఈ రాయల్ వెడ్డింగ్ జరుగుతోంది. ప్రముఖుల రాకపోకల దృష్ట్యా రిసార్ట్ చుట్టూ, ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అతిథుల కోసం తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, కర్ణాటక స్పెషల్ బిసిబేళా బాత్‌తో పాటు కొడవ సంప్రదాయంలో ప్రత్యేకమైన పోర్క్ కర్రీ వంటి వంటకాలతో భారీ విందును సిద్ధం చేశారు. వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు.


More Telugu News