ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలపై స్పందించిన హైడ్రా కమిషనర్

  • ఎప్‌టీఎల్ మార్పులు చేర్పులుండ‌వన్న రంగనాథ్
  • సున్నం చెరువు చెంత ప్ర‌భుత్వ భూమి ఉంటే వెన‌క్కి తీసుకుంటామని హామీ
  • ఎమ్మెల్యే కృష్ణారావు విమ‌ర్శ‌ల‌ను ఖండించిన‌ హైడ్రా క‌మిష‌న‌ర్‌
సున్నం చెరువుతో పాటు మ‌రే ఇత‌ర చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిలు ఒక్క‌సారి నిర్ణయిస్తే అవి మార‌వ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిని 2014లోనే నిర్ణ‌యించార‌ని ఆ మేర‌కే అక్క‌డ అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు.

సున్నం చెరువు వ‌ద్ద కొంద‌రికి ల‌బ్ధి చేకూర్చాల‌ని 5 ఎక‌రాల వ‌ర‌కూ మిన‌హాయించి ఎఫ్‌టీఎల్ హ‌ద్దుల‌ను హైడ్రా నిర్ధారిస్తోంద‌ని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు చేస్తున్న ఆరోప‌ణ‌లపై హైడ్రా కమిషనర్ స్పందించారు. ఎమ్మెల్యే ఆరోపణలను కొట్టిపారేశారు. సున్నం చెరువు వ‌ద్ద ప్ర‌భుత్వ భూమిని క‌లిపి గ‌తంలో ఫెన్సింగ్ వేసి ఉంటారని, చెరువు ఎఫ్‌టీఎల్ కు ఇది వర్తించదని అన్నారు. 

హైకోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోనే తాము ప‌ని చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. చెరువు చెంత ప్ర‌భుత్వ భూమి ఉంటే త‌ప్ప‌కుండా స్వాధీనం చేసుకుని అక్క‌డ పార్కులు, ప్లే ఏరియాలు వ‌చ్చేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. మాదాపూర్‌లోని త‌మ్మిడికుంట‌తో పాటు మొద‌ట విడ‌త చేప‌ట్టిన 6 చెరువుల వ‌ద్దా ప్ర‌భుత్వ భూములుంటే స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేశామ‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. గ‌తంలో హైడ్రా చ‌ర్య‌ల‌ను ఎమ్మెల్యే అభినందించడంతో పాటు సహకరించారని వెల్లడించారు.

కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు హఠాత్తుగా హైడ్రా చ‌ర్య‌ల‌తో పాటు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం వెనుక ఉన్న కారణాలేమిటో అర్థం కావ‌డం లేదని అన్నారు. కూక‌ట్‌ప‌ల్లి జోన్ ప‌రిధిలో భూముల విలువ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్లనో, మ‌రే ఇత‌ర కార‌ణాలో కాని ప్ర‌భుత్వ భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన‌ట్టు ఎక్కువ ఫిర్యాదులు అక్క‌డి నుంచే వ‌స్తున్నాయ‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు.

హైడ్రాకు వ‌చ్చిన ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తే కూక‌ట్‌ప‌ల్లి జోన్ నుంచి 40 శాతం వ‌ర‌కు అందుతున్నట్లు తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూములు కాపాడి పర్యావరణహితమైన నగర నిర్మాణమే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఆ దిశ‌గానే హైడ్రా ప‌ని చేస్తోందని అన్నారు. ఏ ఒక్కరి పక్షాన హైడ్రా పని చేయదని, ప్రజలందరూ మెరుగైన జీవితం సాగించేలా హైడ్రా ప్రతి చర్య ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

హైడ్రా ఇప్పటివరకూ 1240 చోట్ల ఆక్రమణలు తొలగించి 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని వెల్లడించారు. ఇందులో బడాబాబులుగా చెలామణి అవుతున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా  హైడ్రా పని చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడమే హైడ్రా వంతు అని, ప్ర‌జ‌లంద‌రికీ ఉప‌యోగ‌ప‌డేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుందని అన్నారు.

ఆ దిశ‌గా కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల రామారం విలేజ్‌లో హైడ్రా స్వాధీనం చేసుకున్న దాదాపు 300 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని వెనువెంట‌నే ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించి ప‌లు శాఖ‌ల‌కు ప్ర‌భుత్వం కేటాయించిందని గుర్తు చేశారు.  అక్క‌డ సాంఘిక సంక్షేమ పాఠ‌శాల‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఇలా వివిధ శాఖ‌లకు కేటాయింపులు ప్ర‌భుత్వం చేసిందని అన్నారు. అలాగే శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్‌లో ఇటీవ‌ల 7 ఎక‌రాల వ‌ర‌కూ హైడ్రా కాపాడితే.. ఆ వెంట‌నే ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల‌కు కేటాయించ‌డంతో పాటు పార్కుల అభివృద్ధికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుందని చెప్పారు.


More Telugu News