టీమిండియాకు గుడ్ న్యూస్.. తిరిగి జట్టుతో చేరనున్న రింకూ సింగ్

  • తండ్రి అనారోగ్యం కారణంగా జ‌ట్టును వీడిన‌ రింకూ సింగ్
  • తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలిపిన బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్
  • జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్న స్టార్ బ్యాటర్
  • రింకూ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం
టీ20 ప్రపంచకప్ 2026లో కీలకమైన సూపర్ 8 దశలో ఉన్న భారత జట్టుకు ఊరట లభించింది. తండ్రి అనారోగ్యం కార‌ణంగా జ‌ట్టును వీడిన‌ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ తిరిగి టీమ్‌తో కలవనున్నాడు. జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్‌కు ముందు అతను అందుబాటులో ఉంటాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ తెలిపారు.

తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో రింకూ సింగ్ మంగళవారం సాయంత్రం చెన్నైలోని భారత జట్టు క్యాంప్ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్లాడు. అయితే, రేపు జింబాబ్వేతో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రానికే రింకూ తిరిగి జట్టుతో చేరతాడని కొటక్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ రింకూ సింగ్ ఆడాడు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ సమాచారం ప్రకారం రింకూ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారని తెలుస్తోంది.

ఈ విషయంపై కొటక్ మాట్లాడుతూ.. "రింకూ తండ్రికి ఆరోగ్యం బాగాలేదు. అందుకే అతను వెనక్కి వెళ్లాడు. ఈరోజు సాయంత్రం అతను తిరిగి జట్టులోకి వస్తాడని భావిస్తున్నాం" అని తెలిపారు. రింకూ తిరిగి రావడంతో జింబాబ్వేతో మ్యాచ్‌కు భారత బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్ఠం కానుంది.


More Telugu News