అవసరమైతే దోశల బండి పెట్టుకుంటా: నటుడు మహేశ్ విట్టా!

  • నటుడిగా ఎదుగుతున్న మహేశ్ విట్టా 
  • రిస్క్ తీసుకోవడం అవసరమని వ్యాఖ్య 
  • ఫ్యామిలీనే తన ధైర్యమని వెల్లడి
  • కష్టపడి సంపాదించడమే ప్రధానమని వివరణ

మహేశ్ విట్టా .. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. కొన్ని సినిమాలలో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు కూడా పడ్డాయి. 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు." ఇలాంటి పాత్రలైతేనే చేస్తాను .. ఇంత ఇస్తేనే చేస్తాను అని మొదట డిమాండ్ చేసేవాడిని. అప్పుడు కరెక్టుగానే ఇచ్చారు. ఆ తరువాత ఎంత ఇచ్చినా చేస్తానని చెప్పాను .. అప్పుడు మాత్రం ఎగొట్టారు" అని చెప్పాడు. 

"జీవితంలో ఒక ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రిస్క్ తీసుకోవాలసిందే. అప్పుడే ఆ ఫ్యామిలీ బాగుంటుంది. మా తాత .. మా ఫాదర్ రిస్క్ తీసుకోకపోవడం వల్లనే నేను కష్టాలు పడవలసి వస్తోంది. ఇండస్ట్రీలో నన్ను నేను నిరూపించుకోవడానికి నేను ఏదో ఒకటి చేయాలి. ఒకవేళ వర్కౌట్ కాకపోతే ఎలా అనే టెన్షన్ కూడా నాకేమీ లేదు. దోశల బండి పెట్టుకుని బ్రతుకుతాను. ఎందుకంటే దోశల బండి పెట్టుకుని ఇళ్లు కట్టినవాళ్లు నాకు తెలుసు" అని అన్నాడు. 

"అవకాశాలు వస్తే సంతోషపడతా .. చేజారిపోయినా లైట్ తీసుకుంటా. కెరియర్ .. అవకాశాలు సంగతి అలా ఉంచితే, నేను నా ఫ్యామిలీకి .. ఫ్రెండ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఫ్యామిలీకి .. ఫ్రెండ్స్ కి దూరంగా ఉండేవాళ్లే సూసైడ్ చేసుకుంటూ ఉండటాన్ని నేను గమనించాను. అందువలన మన వెనుక ఫ్యామిలీ ఉందనే ఒక బలమైన నమ్మకం మనకి ఎప్పుడూ ఉండాలి" అని తన మనసులోని మాట చెప్పాడు. 



More Telugu News