నాగర్‌కర్నూల్‌లో ఉద్రిక్తత.. బాధితులతో కలిసి కేటీఆర్ ధర్నా

  • నాగర్‌కర్నూల్‌లో పర్యటించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్
  • కుమ్మెర జాతర ఘటనలో మృతి చెందిన పసిపాప కుటుంబానికి పరామర్శ
  • బాధిత కుటుంబానికి సంఘీభావంగా కేటీఆర్ నిరసన దీక్ష
  • కాంగ్రెస్ నేతల దాడి వల్లే పసిపాప మృతి చెందిందని ఆరోపణ
  • బాధితులపైనే పోలీసులు కేసు పెట్టారని ఆగ్రహం
నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో రెండు నెలల పసిపాప మరణించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇవాళ‌ ఆయన నాగర్‌కర్నూల్‌లో పర్యటించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలో పాల్గొన్నారు.

వివరాల్లోకి వెళితే... మల్లన్న జాతర సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కుల వివక్షతో చాకలి చంద్రకళ కుటుంబంపై దాడి చేశారని, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రెండు నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటన తర్వాత పోలీసులు తమపైనే కేసు నమోదు చేయడంతో భయపడి గ్రామం విడిచి నాగర్‌కర్నూల్‌లో తలదాచుకుంటున్నామని వారు తెలిపారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితర బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధితులకు సంఘీభావంగా దీక్షలో కూర్చుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో బాధితులకు వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.


More Telugu News