గాంధీ ఆసుపత్రిలో ‘ఐవీఎఫ్’ సక్సెస్.. తొలి బిడ్డ జననం

  • ఆసుపత్రి చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైందంటున్న వైద్యులు
  • రూ.5 కోట్లు వెచ్చించి అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • నిరుపేదలకు అందుబాటులో ఖరీదైన సంతాన సాఫల్య చికిత్స


తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సికింద్రాబాద్‌ లోని గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఐవీఎఫ్ సెంటర్‌లో చికిత్స పొందిన దంపతులకు సంతానం కలిగింది. గైనకాలజీ మరియు ఎంబ్రియాలజీ నిపుణుల బృందం పర్యవేక్షణలో ఈ ప్రసవం విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. తొలి ఐవీఎఫ్ బిడ్డ జననంతో గాంధీ ఆస్పత్రి వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను ఇక్కడ పూర్తి ఉచితంగా అందించారు. ఖరీదైన సంతాన సాఫల్య చికిత్సను నిరుపేదలకు ఉచితంగా అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ విజయంతో నెరవేరింది. 

నిరుపేదలకు వరం..
ఆర్థిక స్థోమత లేక సంతాన సాఫల్య చికిత్సకు దూరమవుతున్న వేలాది మంది దంపతులకు ఈ విజయం కొత్త ఆశలను చిగురింపజేసింది. ప్రభుత్వ రంగంలో ఇటువంటి అత్యాధునిక చికిత్స విజయవంతం కావడం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సాధించిన పెద్ద విజయంగా భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలోని ఈ సెంటర్‌లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఎంబ్రియాలజీ ల్యాబ్, అడ్వాన్స్‌డ్ ఓటీలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.


More Telugu News