అందుకే నేను సోషల్ మీడియాకి దూరం: బుల్లెట్ భాస్కర్

  • మిమిక్రీ చేసేవాడినన్న బుల్లెట్ భాస్కర్
  • వేషాల కోసం హైదరాబాద్ వచ్చానని వెల్లడి 
  • 'జబర్దస్త్' ఆదరించిందంటూ కృతఙ్ఞతలు
  • ఒకరితో చెప్పించుకోవడం ఇష్టం ఉండదని వివరణ   
  
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. ఈ షో నుంచి హీరోలు అయినవాళ్లు .. కమెడియన్స్ గా వెండితెరకి వెళ్లినవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటివారిలో బుల్లెట్ భాస్కర్ ఒకరుగా కనిపిస్తాడు. మహేశ్ బాబు వాయిస్ ను .. కృష్ణంరాజు బాడీ లాంగ్వేజ్ ను అనుకరించడం బుల్లెట్ భాస్కర్ కి మంచి పేరును తెచ్చిపెట్టాయి. 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

"మాది వైజాగ్ .. మిమిక్రీ చేయడం నాకు ఇష్టం. అదే నన్ను 'ఆర్జే'ను చేసింది. ఆ తరువాత నన్ను నేను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాను. ఆ సమయంలో నాకు అవకాశాన్ని ఇచ్చి ఆదుకున్నది 'జబర్దస్త్'. ఈ షో కారణంగా నాకు మంచి పేరు వచ్చింది. నేను టీమ్ లీడర్ గా ఎదగడానికీ .. నేను మరికొందరికి ఒక మార్గాన్ని చూపించడానికి తగిన అవకాశాన్ని ఇచ్చింది. ఒక కామెడీ షో విపరీతమైన క్రేజ్ తో చాలా కాలం పాటు అలరించడం విశేషం" అని అన్నాడు.    

" నేను సోషల్ మీడియాకి దూరం. సోషల్ మీడియాలోకి వెళ్లడమంటే, బట్టలిప్పేసి రోడ్డు మీదికి రావడంలాంటిది. అలా బయటికి రావడం ఎందుకు? ప్రతి ఒక్కరితో అనిపించుకోవడం ఎందుకు? అనేది నా అభిప్రాయం. ఎవరికి తోచిన కామెంట్స్ వాళ్లు పెడతారు. ఒకరితో చెప్పించుకోవడం .. ఒకరితో అనిపించుకోవడం నాకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు. డబ్బులున్నా లేకపోయినా ఫరవాలేదు. సోషల్ మీడియాలోకి మాత్రం రాను" అని ఆయన అన్నాడు. 



More Telugu News